72 వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు

నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం. 72 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, ఇతర పార్టీ నేతలు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు అంతా చీతాల సమక్షంలో గడపనున్నారు. ఆఫ్రికా నమీబియా నుంచి ఎనిమిది చీతాలు కార్గొ విమానంలో ప్రయాణించి, గ్వాలియర్ కు చేరుకున్నాయి. అక్కడి నుంచి వాటిని కునో నేషనల్ పార్కు వద్దకు చేరుస్తారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా చీతాలను పార్కులోకి విడిచిపెడతారు. ఈ కార్యక్రమం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

 

ఇక… బీజేపీ కూడా మోదీ జన్మదినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. 21 రోజుల పాటు సేవా సమర్పణ్ పేరుతో ప్రచారాన్ని కూడా చేసింది. ప్రధాని మోదీ జీవితం, నాయకత్వంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను బీజేపీ జాతీయ కార్యాలయంలో ప్రారంభిస్తారు. అక్టోబర్ 2 వరకూ వేడుకలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మోదీ జీవితంపై ఎగ్జిబిషన్లు వుంటాయని బీజేపీ ప్రకటించింది.

 

మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీ కృషి, అంకితభావం, సృజనాత్మకతతో సాగిస్తున్న దేశ నిర్మాణ సంగ్రామం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇక… మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts