దాదాపు 30 సంవత్సరాల తర్వాత జమ్మూ కశ్మీర్ థియేటర్లలో బొమ్మ పడింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ. జమ్మూ కశ్మీర్ ప్రజలకు చాలా సంవత్సరాల తర్వాత వినోదం దరి చేరింది. పుల్వామా, షోఫియాలలో మల్టీ పర్పస్ సినిమా థియేటర్లను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బాగ్ మిల్కా బాగ్ సినిమాను డీజీపీతో కలిసి వీక్షించారు. ప్రజలు కూడా సినిమాను వీక్షించి, సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎల్జీ మనోజ్ సిన్హా మాట్లాడుతూ… జమ్మూ కశ్మీర్ కు చారిత్రక దినమని అభివర్ణించారు.
ఇలాంటి మల్టీ మాల్స్ ను ప్రతి జిల్లాలోనూ తీసుకొస్తామని ప్రకటించారు. ఈ సినిమా హాళ్లను యువతకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అనంతనాగ్, శ్రీనగర్, బందిపొర, రాజౌరీ, పూంచ్ లాంటి ప్రాంతాల్లోనూ త్వరలోనే థియేటర్లు అందుబాటులోకి వస్తాయని ఎల్జీ ప్రకటించారు. వీటితో పాటు వచ్చే వారంలో కశ్మీర్ లో తొలి ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ ప్రారంభం కానున్నట్టు మనోజ్ సిన్హా చెప్పారు. శ్రీనగర్ లోని సోమ్ వార్ లో ఇది ప్రారంభమవుతుందన్న ఆయన.. 520 సీట్ల సామర్థ్యంతో మూడు స్ర్కీన్లు కలిగిన థియేటర్ అందుబాటులోకి రానుందని తెలిపారు.