RRR సినిమా పాట నాటు నాటుకి ఆస్కార్ రావడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ కి సీఎం కేసీఆర్, సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం పల్ల గర్వంతో ఉప్పొంగుతున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేశారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషమన్నారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర నెలకొల్పిందన, గ్లోబల్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులు చేసినం పాట అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసిందన్నారు. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహకాన్ని ఇచ్చిందని జగన్ ట్వీట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తంచేశారు. విశ్వ సినీయవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును (Oscar award) గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ (Natu Natu) పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ (Telangana) సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి, అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని తెలిపారు.

తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును ఈ పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్‌ను  ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి , కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి , గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్, సినిమా నిర్మాత డీవీవీ దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.