తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారి పేరును ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శాంతి కుమారి 2025, ఏప్రిల్ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శాంతి కుమారి.. గ‌తంలో సీఎం కార్యాల‌యంలో ప‌ని చేశారు. తెలంగాణ తొలి మ‌హిళా సీఎస్‌గా శాంతి కుమారి రికార్డు సృష్టించారు. ప్ర‌స్తుతం ఆమె అట‌వీ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు. గ‌తంలో వైద్యారోగ్య శాఖ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు.

సీఎస్ గా వున్న సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కి వెళ్లాలని హైకోర్టు సూచించడం, కేంద్రం ఆయన్ను రిలీవ్ చేసిన నేపథ్యంలో కొత్త సీఎస్ ను ఎంపిక చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై పడింది. దీంతో నూతన సీఎస్ గా శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు పేరును సీఎం ఖరారు చేస్తారని బాగా ప్రచారం జరిగింది. అయితే… తదుపరి సీఎస్ జాబితాలో శాంతి కుమారి కూడా వున్నారు.