ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 2 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరిలావు, ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్ సునీల్ పంత్ర తెలిపారు. అంకిత సేవా భావం` అద్భుత కళాధామం నినాదంతో వివిధ సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలకు తానా శ్రీకారం చుట్టింది. చైతన్య స్రవంతిలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా క్యాన్సర్ అవగాహన శిబిరాలు, 30కి పైగా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 2500 మంది రైతులకు రక్షణ పరికరాలు, 500 మందికి పైగా రైతులకు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయనున్నారు.
విద్యార్థుల కోసం 10కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సైకిళ్లు, క్రీడా పరికరాలతో పాటు మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని విద్యార్థులకు అందించాలని నిర్ణయించారు. దివ్యాంగుల కోసం మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. ప్రమఖ కవులు, రచయితలు, సాహితీ దిగ్గజాల ప్రసంగాలతో విభిన్న అంశాలపై చర్చా వేదికలు ఏర్పాటు చేయనున్నారు.