శీతాకాల విడిదిలో భాగంగా రెండు రోజుల నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో వుంటున్నారు. ఈ సందర్బంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం శ్రీసీతారామ చంద్రుడ్ని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ముందుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తారు. అక్కడి నుంచి ఉదయం 10:30 కల్లా భద్రాచలం చేరుకుంటారు. భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామిని, రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం కింద మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రపతి భూమి పూజ చేస్తారు.
అనంతరం వీరభద్ర ఫంక్షన్ హాల్లో జరిగే గిరిజన పూజారుల సమ్మేళనంలో పాల్గొంటారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 1.35కు భద్రాద్రి నుంచి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వెళ్తారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో బుధవారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. భద్రతా కారణాలతో భద్రాచలం రామవారధిపై ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాకపోకలు నిషేధించారు. రాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
ఇక… మధ్యాహ్నం భద్రాద్రిలో లంచ్ చేసుకొని, నేరుగా ములుగులోని రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆలయంలో రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రూ.62 కోట్లతో ప్రసాద్ స్కీం కింద చేపట్టబోయే పనులను, రూ.15 కోట్లతో చేపట్టబోయే కామేశ్వర ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడే తన కోసం తయారు చేసిన గ్రీన్ హౌస్ లో రాష్ట్రపతి కాసేపు సేద తీరుతారు. రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా రెండు గిరిజన నృత్యాలను ప్రదర్శించనున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి తిరిగి హైదరాబాద్ కి చేరుకుంటారు.