భారత ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరు : అమిత్ షా

భారత ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరు. భారత భూమిలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రమైన అరుణాచ్ ప్రదేశ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు పర్యటించారు. అరుణాచల్ ప్రదేశ్‌ లోని కిబితూలో ”వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం” ను ఆయన ప్రారంభించారు. ఇలా పర్యటించడం, అధికారిక కార్యక్రమాలు చేపట్టడం చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పై విధంగా చైనాకి కౌంటర్ ఇచ్చారు. 2014 కంటే ముందు ఈశాన్య రాష్ట్రాలంతా అస్తవ్యస్తంగా వుండేవని, ప్రధాని నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారిందన్నారు. లుక్ ఈస్ట్ విధానం కారణంగా ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దేశ అభివృద్ధికి దోహదపడే ప్రాంతంగా మారిపోయిందని అమిత్ షా ప్రకటించారు.

2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు రూ.4,800 ఆర్థిక కేటాయింపులతో కేంద్ర ప్రాయోజిత పథకమైన “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కి మోదీ సారథ్యంలోని కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఉత్తర సరిహద్దులోని బ్లాకుల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు. తొలి విడతగా 662 గ్రామాలను గుర్తించామని, అందులో 455 గ్రామాలు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయని తెలిపారు.

దేశ ప్రజలందరూ ఇవాళ ప్రశాంతంగా ఇళ్లలో నిద్రిస్తున్నారంటే అందుకు మన సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారా కాస్తున్న మన ఐటీబీపీ జవాన్లు, ఆర్మీనే కారణమని ప్రకటించారు. దుష్టపన్నాగంతో మన భూభాగంపై కన్నేసే సాహసం ఎవరూ చేయలేరని, ఈ విషయాన్ని మనం ఇవాళ చాలా గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. జవాన్ల త్యాగాలకు నేను సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఆయన పర్యటనను చైనా తప్పుబట్టింది. అమిత్ షా పర్యటన ఆ ప్రాంతంపై చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ఈ వాదనను భారతదేశం పూర్తిగా తోసిపుచ్చింది.

Related Posts

Latest News Updates