దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. అమృత్ ఉద్యాన్ గా నామకరణం చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మొఘల్ గార్డెన్స్ పేరును ఈ మేరకు మార్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గా జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్ గార్డెన్స్కు అమృత్ ఉద్యాన్ అని రాష్ట్రపతి ముర్ము పేరు పెట్టినట్లు చెప్పారు. జనవరి 29న గార్డెన్ కొత్త పేరును ఆమె ఆవిష్కరిస్తారని వెల్లడించారు. జనవరి 31 నుంచి మార్చి 26 వరకు దాదాపు రెండు నెలల పాటు సందర్శకుల కోసం ఇది ఓపెన్ చేసి ఉంచుతారు. సాధారణంగా గార్డెన్ ప్రజల సందర్శన కోసం ఒక నెల పాటు ఓపెన్లో ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఈ గార్డెన్లో పలు రకాల పూలు-సంపూర్ణంగా వికసించినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చూసే అవకాశం కల్పించేవారు.












