బీఆర్ఎస్ వల్ల బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాగాలు చేయడం కేసీఆర్కు కొత్త కాదని, భారత రాష్ట్ర సమితికి దైవశక్తి అవసరమని వివరించారు. కాబట్టే యాగాలు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్లో చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయని కవిత ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత్ జాగృతి ద్వారా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు అమలు చేస్తాం అని కవిత ప్రకటించారు. రాష్ట్రంలో తెలంగాణ జాగృతి కొనసాగుతోందని క్లారిటీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతోందని, బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేస్తామని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాలు ఖరారు చేస్తాం అని కవిత స్పష్టం చేశారు.