తెలంగాణలో నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సును మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జరుగుతున్న ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ అదనపు సీఈవో బసంత్‌ గార్గ్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. మూడురోజులపాటు జరుగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 2 వేలకు మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, మెడ్‌టెక్‌, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు, బృంద చర్చలు జరుగనున్నాయి. వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సమావేశాలు, ప్రపంచస్థాయి నిపుణులతో చర్చలు, ఇంటరాక్టివ్‌ సెషన్స్‌, సీఈవో కాంక్లేవ్‌, స్టార్టప్‌ షోకేస్‌, బయోపార్క్‌ సందర్శనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. రెండురోజులపాటు లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు.

 

హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. లైఫ్‌సైన్స్‌ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్‌ అవతరించిందని చెప్పారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీ వరల్డ్‌ లార్జెస్ట్‌ హబ్‌గా నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. గత ఏండేండ్లలోనే 3 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రపంచంలోని టాప్‌-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని  పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని చెప్పారు. ఇక్కడ 8 వందలకుపైగా ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నదని వెల్లడించారు. దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నదని చెప్పారు.