స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. షోయబ్ ఉల్లా ఖాన్ తెలంగాణ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తి అని, గోలకొండ పత్రికతో సురవరం పోషించిన పాత్ర మరువలేనిదని చెప్పారు. పత్రికా యాజమాన్యం కంటే తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తి ఎక్కువని చెప్పారు. ఉద్యమ రోజుల్లో పత్రికా యాజమాన్యాలు తెలంగాణకు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండేవని గుర్తుచేశారు. జర్నలిజం ముసుగులో ఇప్పటికీ వ్యక్తిగత దూషణలు, బూతులు తిడుతున్నారని చెప్పారు. హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పేపర్లు చదవాల్సి వస్తుందన్నారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నాయని వెల్లడించారు.

యాజమాన్యాలు ఎలా ఉన్న టీఆర్ఎస్కు అండగా నిలబడింది తెలంగాణ జర్నలిస్టులేనని చెప్పారు. స్టింగర్ల నుంచి డెస్క్ వరకు తమకు సపోర్టుగా నిలబడటంతోనే తెలంగాణ సాధించగలిగామన్నారు. తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీదాక వచ్చి తెలంగాణ కోసం కొట్లాడారని గుర్తుచేశారు. జర్నలిస్టుల ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్ ఏనాడు తగ్గించలేదని చెప్పారు. ర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 19 వేల అక్రిడేషన్ కార్డులున్న జర్నలిస్టులు రాష్ట్రంలో ఉన్నారన్నారు.
9 బిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్లను హైదరాబాద్ ఉత్పత్తి చేసిందని, కరోనా వ్యాక్సిన్ల గురించి మన మీడియా ఎందుకు హైలెట్ చేయలేదని వాపోయారు. జో బైడెన్ ప్రయాణించే హెలికాప్టర్ క్యాబిన్ కూడా హైదరాబాద్లోనే తయారయిందన్నారు. మిషన్ కాకతీయ వల్ల చెరువు కట్టలు బలంగా ఉండి తెగడంలేదన్నారు. చెరువు కట్టలు తెగితే వార్తకానీ.. బలంగా ఉంటే వార్త కాదా అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారు. మొదటి ఎన్నికల్లో తాను చాలా కష్టం గెలిచాను.. పనితీరుతోనే సిరిసిల్లలో తన మెజారిటీని క్రమంగా పెంచుకోగలిగానని చెప్పారు. సరిగా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు తనను కూడా పక్కన పెట్టేవారని చెప్పారు.