2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉద యం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. నిరుడు మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు క్యాబినెట్‌ సమావేశమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెలిపింది.

 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ను తయారు చేసినట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జొడేద్దుల్లగా సమపాళ్లలో బడ్జెట్ ఉండబోతోందని వెల్లడించారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కేసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు వివరించారు. కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు.

 

తెలంగాణ మోడల్ను దేశం అవలంభిస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచిందని చెప్పారు. బడ్జెట్కు కేబినేట్ ఆమోదంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించిందన్నారు. శాసనసభలో తాను..శాసన మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు.

మరికాసేపట్లో మంత్రి హరీశ్‌ రావు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం హరీశ్‌ రావు శాసనసభకు చేరుకున్నారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌ రెడ్డితో పాటు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని కలిశారు. ఆయనకు బడ్జెట్‌ ప్రతులను అందజేశారు. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో మంత్రి హరీశ్‌ రావు, శాసన మండలిలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టున్నారు.