చిన్నారి లైంగిక దాడికి కారణమైన బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే.. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ అకాడమిక్ ఇయర్ ను నష్టపోకుండా వుండేందుకు ఇతర పాఠశాలల్లో వారిని సర్దుబాటు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. అయితే… ఈ వ్యవహారంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలు వస్తే.. వాటిని తీర్చాల్సిన పూర్తి బాధ్యత జిల్లా విద్యాశాఖాధికారిదేనని మంత్రి స్పష్టం చేశారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో పాఠశాల విద్యా శాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబందించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.