తెలంగాణలో మరో ప్రపంచ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. Bristol Myers Squibb అనే సంస్థ ప్రపంచంలోనే టాప్ 10 ఫార్మాసుటికల్ కంపెనీల్లో ఒకటి. 800 కోట్ల రూపాయలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఈ ఒప్పందంతో 1500 మందికి ఉపాధి కలుగనుంది. రానున్న మూడు సంవత్సరాల్లో తమ కంపెనీ సుమారు 1500 మంది ఉద్యోగులను నియమించుకుంటుందని.. 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిని పెట్టబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తమ సంస్థ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించబోతోందని వారు స్పష్టం చేశారు.

నగరం బయోటెక్నాలజీ, ఐటీ కి గొప్ప ఆకర్షణీయ గమ్య స్థానంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఎంఎస్‌ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో  అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ ఫార్మాసుటికల్‌ కంపెనీల్లో బీఎంఎస్‌ ఒకటి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వారిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

2028 నాటికి రాష్ట్రంలోని లైఫ్‌ సైన్సెస్‌ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ రోజు బీఎంఎస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ఈ సంస్థ ఏర్పాటు ఒక గొప్ప అవకాశం’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎంఓయూ  ద్వారా 1,500 మందిని నియమించుకుంటామన్న బీఎంఎస్‌ కంపెనీ త్వరలోనే తమ లక్ష్యాన్ని చేరుకొని మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న నమ్మం తమకు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.