జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సస్పెన్షన్పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో తన ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా తన ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని నిరూపించుకోనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుందని, ఈ సందర్భంగా సభలో సీఎం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారని పేర్కొన్నారు. సీఎం హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర గవర్నర్కు సూచించింది. దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయమే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ కూడా సమావేశాలకు సిద్ధమవుతున్నది.