వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురుతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోలీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సంప్రదాయం రమణీయమైనదని తెలిపారు.రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
హోలీ నేపథ్యంలో పల్లెల్లో వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటాపాటలతో, కోలాటాల చప్పుళ్లతో ఉత్తేజం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా సింగిడి రంగుల నడుమ కేరింతలతో సాగే హోలీ.. మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను, ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని అందిస్తుందని తెలిపారు. భేదభావాలను వీడి పరస్పర ప్రేమ, అభిమానాలను చాటుకొంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.