జీవో నెం.1 ని భోగి మంటల్లో తగలబెట్టి… నిరసన తెలిపిన చంద్రబాబు

తెలుగు రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సొంతూరు నారావారి పల్లెలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1 కాపీలను మంటల్లో వేసి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనను ప్రజలతో కలవనీయకుండా కుట్ర చేస్తున్నారని, అందుకే జీవో నెం.1 ని తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులు మరీ దారుణంగా వున్నాయన్నారు. ఏ ప్రభుత్వమైనా… భవిష్యత్తు కోసం, ఉపాధి అవకాశాల కోసం పరిపాలన చేయాలని, కానీ… జగన్ ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వుందని మండిపడ్డారు.

ప్రశ్నించినందుకే తనపై కేసులు పెడుతున్నారని, కనీసం తన సభలకు బందోబస్తులు కూడా కలిపించడం లేదని చంద్రబాబు ఆరోపించారు. తెలుగు ప్రజల జీవితాలను టీడీపీ ఆవిర్భావం ముందు, తరువాత అన్న కోణంలో చూడాలని చంద్రబాబు అన్నారు. తమ హయాంలో ఐటీ సెక్టార్ ను ఎంతో ప్రోత్సహించామని, ఇప్పుడు దాని ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. కొందరు ఇప్పటి కోసమే జీవిస్తుంటారని, కానీ… తన పాలన అంతా భవిష్యత్తునే చూస్తూనే సాగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Related Posts

Latest News Updates