పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నది. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు  ప్రకటించారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌  మాట్లాడుతూ  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందన్న ఆయన,  పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నిర్వహించుకునే కార్యక్రమాల వివరాలను తెలిపారు.ఈ నెల 25న తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇన్‌చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతాని పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్థలికి చేరుకోవాలని శ్రేణులకు సూచించారు. 25న రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరుగుతుంద న్నారు.