టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన సంజయ్.. గర్బగుడి ముందు నిల్చుని ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఎలాంటి తప్పూ చేయకుంటే.. తమ లాగే ఆయన కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ డైరెక్షన్ లోనే ఫాంహౌజ్ డ్రామా అంతా నడిచిందని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారన్న సంజయ్… దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. నిజమైన ఆడియో అయితే సీఎం ఊరుకుంటారా? అని అన్నారు. దొంగ ఆడియో రికార్డులు తయారు చేయడానికి వారికి రెండ్రోజులు పట్టిందని, నేరస్తులు, ఎమ్మెల్యేల కాల్లిస్టు బయట పెట్టాలని బండి సంజయ్ సూచించారు. ఏం చేసినా మునుగోడులో గెలిచేది తామేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.