తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మహేందర్ రెడ్డి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్ కు అభినందనలు తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్.. అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా తొలి పోస్టింగ్ పొందారు. ఆ తరువాత మహబూబ్నగర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. 1998లో ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి ఎంపికై బోస్నియా-హెర్జిగోవినాలో సంవత్సరంపాటు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన రెండుసార్లు ఐక్యరాజ్యసమితి శాంతి పతకాన్ని అందుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్గా, గ్రేహౌండ్స్ చీఫ్గా, నిజామాబాద్ రేంజ్ల డీఐజీగా, వరంగల్ ఐజీగా, హైదరాబాద్ ఏసీపీగా, సీపీగా, ఏసీబీ డీజీగా వివిధ హోదాల్లో అంజనీకుమార్ పని చేశారు.

రాష్ట్ర డీజీపీగా నియమితులైన అంజనీకుమార్కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపీఎస్ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్ ముందువరుసలో ఉన్నారు. 1966 జనవరి 28న బీహార్లో జన్మించిన అంజనీకుమార్.. పాట్నా సెయింట్ జేవియర్ స్కూల్లో ప్రాథమిక, ఉన్నత విద్య ను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. ఐపీఎస్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు రెండు అవార్డులతోపాటు రాష్ట్రపతి పోలీసు మెడల్ అందుకొన్నారు. 2026 జనవరిలో పదవీవిరమణ చేయనున్నారు.