మళ్లీ ఏపీ వర్సెస్ తెలంగాణగా రాజకీయాలు మారిపోతున్నాయి. తెలంగాణ మంత్రి హరీశ్ రావు పోలవరం ప్రాజెక్టు విషయంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్నాయి. పోలవరం విషయంలో మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ… ఏపీకి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు గురించి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ను మరో అయిదేళ్లు అయినా పూర్తి చేయలేరని, పోలవరం పనులు పురోగతిపై అక్కడ ఇంజనీర్లతో మాట్లాడానని పేర్కొన్న మంత్రి, మరో ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తే గొప్పే అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పోలవరం కాళేశ్వరం కంటే ముందే స్టార్ట్ అయినప్పటికీ పూర్తి కాలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తి చేసుకున్నామో అందరూ చూశారు అని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్న ఫలితాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

 

 

అయితే తెలంగాణ మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వర ప్రాజెక్టు వేరు, పోలవరం ప్రాజెక్టు వేరు అని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు నక్కకూ, నాగలోకానికి వున్నంత తేడా వుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 2 టీఎంసీల సామర్థ్యం వున్న బ్యారెజ్ అని, అది పూర్తిగా ఓ లిఫ్ట్ ఇరిగేషన్ అని వివరించారు. కానీ పోలవరం అలా కాదని, బహుళార్థ సాధక ప్రాజెక్టు అని అన్నారు. 196 టీఎంసీల నీటిని స్టోర్ చేసుకొని, గ్రావిటీ ద్వారా నీటిని తరలించి, నిర్వహించే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం అని పేర్కొన్న ఆయన అసలు పోలవరానికి, కాళేశ్వరానికి పోలికే లేదని స్పష్టం చేశారు.