బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి కేసులో డ్రైవర్‌ రజినీకుమార్‌ను నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది.బంజారాహిల్స్‌ రోడ్డు నం. 14లోని డీఏవీ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ఐదేండ్ల బాలికపై అదే స్కూల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భీమన రజినీకుమార్‌(34) లైంగికదాడికి పాల్పడ్డాడు. స్కూల్‌లోని డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లోకి తీసుకువెళుతూ రోజూ బాలిక పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో చిన్నారి తీవ్ర ఆందోళనకు గురైంది. బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా దారుణం బయటపడింది.

 

ఈ వ్యవహారంపై బాలిక తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు చేరుకుని నిందితుడికి దేహశుద్ధి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అక్టోబర్‌ 17న నిందితుడు రజినీకుమార్‌తో పాటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మాధవిపై 376 (ఏబీ) రెడ్‌విత్‌ 5 (ఎం), 21 ఆఫ్‌ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్‌ 19వ తేదీన అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు.. రజినీకుమార్‌ను దోషిగా తేల్చింది. అతనికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన అప్పట్లో పెను దుమారమే రేపింది. ప్రభుత్వం ఆ స్కూల్ గుర్తింపును కూడా రద్దు చేసింది. అయితే.. తల్లిదండ్రుల కోరిక మేరకు నవంబర్ లో ఆ పాఠశాల పున: ప్రారంభమైంది. అక్టోబర్ 19 న నిందితుడ్ని, ప్రధానోపాధ్యాయురాలు మాధవీని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు.