ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బండి సంజయ్ పై కేసీఆర్ ప్రభుత్వం కక్షగట్టిందని, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల వ్యాప్తంగా వున్న బీజేపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు బండి సంజయ్ ని బొమ్మల రామారం పీఎస్ కి తరలించారన్న విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పీఎస్ వైపు దూసుకొచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. బీజేపీ నేతల తాకిడి పెరగడంతో అక్కడికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు.

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్ అందరూ బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. బొమ్మల రామారం పీఎస్ లో వున్న బండి సంజయ్ ని పరామర్శించేందుకు వచ్చిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అడ్డుకున్నారు. మెడపై చేయి లాగుతూ.. దురుసుగా ప్రవర్తిస్తూ ఆయన్ను అరెస్ట్ చేశారు. బలవంతంగా చొక్కా పట్టి లాగడంతో పోలీసులపై ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రఘునందన్ రావుకి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

అదే విధంగా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయానికి వస్తుండగా హకీంపేటలో పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వెళుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య వస్తుందని.. అందుకే అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టులు, గృహనిర్బంధాలు కొనసాగుతున్నాయి.