తెలంగాణలో పదో తరగతి ప్రశ్న పత్రాలు వరుసగా లీక్ కావడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పదో తరగతి పరీక్షల విషయంలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, పోలీసు, పోస్టల్, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ అధికారులు అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకోవాలి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దని మంత్రి కోరారు.
రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం వీడాలన్నారు. నిజాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాలని వరంగల్, హనుమకొండ డీఈవోలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వరంగల్ డీఈవో వాసంతి సీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిందీ క్వశ్చన్ పేపర్ ఏ స్కూల్ నుంచి బయటకు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. మొదటి సారి పరీక్షలు రాస్తున్న చిన్నారులను గందరగోళానికి గురిచేయాలని ఎవరు ప్రయత్నించినా… ప్రభుత్వం కఠినంగా వుంటుందని మంత్రి సబితా హెచ్చరించారు.