రానున్న ఎన్నికలలో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొమురవెళ్లి మల్లన్నను మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసేందుకే ఈడీ, సీబీఐ దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. కేంద్రానికి దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడాలని, ప్రశ్నించే గొంతులను నొక్కడం సరి కాదని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల అప్పులు చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిన వారిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఉద్యమాలే ఊపిరిగా, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు.తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్సీ కవిత ను,మహిళలను కించపరిచే విధంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలను అభివృద్ధి చేస్తుంటే, కొందరు దేవుళ్ల పేరుపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు.