లిక్కర్ స్కాంలో విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కారులో చేరుకున్నారు. ఈ సందర్భంగా కవిత కారుతో పాటు మరొక కారుకు మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు.ఈడీ విచారణకు బయల్దేరిన సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు జై కవిత… జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈడీ కార్యాలయంలోకి విచారణ నిమిత్తం వెళ్లే ముందుకు కార్యకర్తలకు అభివాదం చేశారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేస్తే ఆందోళనలు చేసే అవకాశం ఉందని వచ్చిన సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు సీఎం కేసీఆర్ నివాసం వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ జాగ్రత్తలతో పాటు మరికొన్ని హెచ్చరికలు కూడా ఢిల్లీ పోలీసులు చేశారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ప్రకటించారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఈడీ ఆఫీస్ పరిసరాల్లో ఉండొద్దని.. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ముందస్తు చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి బయల్దేరారు. ముందుగా శుక్రవారం రాత్రి మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత మంత్రి హరీశ్ రావు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. కవిత, కేటీఆర్, హరీశ్ ముగ్గురూ ఢిల్లీలో భేటీ అయ్యారు. వీరందరూ కలిసి న్యాయనిపుణులు, పార్టీ లీగల్ సెల్ తో సుదీర్ఘంగా చర్చించారు. అయితే… కవితకు నైతిక మద్దతు కోసం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి బయల్దేరారు.