అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హఠాత్తుగా ఉక్రెయిన్ లో ప్రత్యక్షమయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలు పెట్టి, ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో సంఘీభావం ప్రకటించేందుకు జోబైడెన్ అక్కడ పర్యటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను జెలెన్ స్కీని అడిగి తెలుసుకున్నారు. ఏడాదిగా ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు సాగుతోందని, అదో కిరాతకం, అన్యాయమైన యుద్ధమని జోబైడెన్ అభివర్ణించారు. ఇంత సుదీర్ఘమైన యుద్ధం జరుగుతున్నా… ఉక్రెయిన్ తట్టుకొని నిలబడిందని, అమెరికాతో సహా ప్రపంచం అంతా ఉక్రెయిన్ తోనే వుందని జోబైడెన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే… అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హఠాత్తుగా ఉక్రెయిన్ లో ప్రత్యక్షం కావడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇక… పుతిన్ ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.
అయితే ఎక్కడా పత్రికా ప్రకటన లేదు. హడావుడి అంతకంటే లేదు. చాలా సైలెంట్ గా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉక్రెయిన్ లో దిగిపోయారు. ముందుగా ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. వాషింగ్టన్లోని ఆండ్రూస్ బేస్ నుంచి ఉదయం 4 గంటలకు బైడెన్ విమానంలో పోలాండ్కు బయలుదేరారు. ఆ దేశ రాజధాని వార్సాకు చేరుకున్న ఆయన అక్కడ నుంచి ప్రత్యేక రైలులో కీవ్కు ప్రయాణించారు. దాదాపు 10 గంటల పాటు ప్రయాణం సాగింది. అయితే… ఉక్రెయిన్కు బైడెన్ వస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. దాదాపు అయిదు గంటల పాటు కీవ్లో బైడెన్ గడిపారు. ఆధునిక చరిత్రలో అమెరికా అధ్యక్షుడు అసాధారణ జర్నీ చేసినట్లు వైట్హౌజ్ వెల్లడించింది.

కీవ్ టూర్కు వెళ్లాలన్న దానిపై శుక్రవారమే ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లు వైట్హౌజ్ వర్గాలు తెలిపాయి. కేవలం పోలాండ్కు మాత్రమే బైడెన్ వెళ్తున్నట్లు ఆదివారం కూడా బ్రీఫింగ్ ఇచ్చారు. కానీ ఎయిర్ ఫోర్స్ వన్ టేకాఫ్ సమయంలో కొందరు మాత్రమే అధికారులు ఉన్నారు. మెడికల్ టీమ్, సెక్యూర్టీ ఆఫీసర్లతో ఆ విమానం బయలుదేరింది. అధ్యక్షుడు బైడెన్తో కేవలం ఇద్దరు జర్నలిస్టులకు మాత్రమే అవకాశం కల్పించారు. అయితే… కీవ్లో బైడెన్ అడుగుపెట్టిన తర్వాతే ఆ జర్నలిస్టులకు వార్తలను రాసే అవకాశం కల్పించారు.

దీంతో పాటు ఆయన అధికారిక విమానం అయిన ఎయిర్ ఫోర్స్ 1 ని కూడా పక్కనపెట్టేశారు బైడెన్. దీనికి బదులుగా అమెరికా వాయుసేన ఉపయోగించే సీ 32లో బయల్దేరారు. ఆయన వెంట అతి తక్కువ మంది భద్రతా సిబ్బంది మాత్రమే వున్నారు. అయితే… రిపోర్టర్లను అనుమతించినా… వారి వద్ద నుంచి సెల్ ఫోన్లను తీసేసుకుంది వైట్ హౌజ్ సిబ్బంది. బైడెన్ విమానం జర్మనీలో రామ్ స్టెయిన్ లోని అమెరికా సైనిక స్థావరానికి చేరుకుంది. అక్కడి నుంచి పోలండ్ లోని జెసోస్ నగరానికి జెసియోనాక్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఇక్కడి నుంచి ఓ రైలులో ప్రయాణించి కీవ్ కి చేరుకున్నారు.












