బాలీవుడ్ ప్రేమ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం మంగళవారం రాజస్థాన్లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం తర్వాత మొదటి సారిగా ఈ జంట మీడియా ముందుకు వచ్చింది. వివాహం అనంతరం బుధవారం ఈ కొత్త జంట ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయం వద్ద మీడియా మిత్రులను కలిసింది.

ఈ సందర్భంగా వారికి స్వీట్స్ బాక్స్లను అందించింది. ఇద్దరూ ఎరుపు రంగు దుస్తులు ధరించి, మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగ్రహ్ ప్యాలెస్లో కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.












