హైదరాబాద్ సిటీలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. దీంతో హైదరాబాద్ కి పూర్వ వైభవం రానుంది. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను సీఎస్ శాంతి కుమారి జెండా ఊపి ప్రారంభించారు. నానక్‌రాంగూడలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న మూడు ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఈ నెల 11న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఫార్ములా ఈ-ప్రిక్స్‌ నేపథ్యంలో ఈ బస్సులు ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు, ప్యారడైజ్‌, నిజాం కాలేజీ స్ట్రెచ్‌లను కవర్‌చేసే రేస్‌ ట్రాక్‌ చుట్టూ తిరుగుతాయి. ఆ తర్వాత హెరిటేజ్ సర్కిల్స్ లోనూ వీటిని ఉపయోగించనున్నారు.

హైదరాబాద్‌లో డబుల్‌ డెకర్‌ బస్సులకు చారిత్రక ప్రాధాన్యం ఉన్నది. నిజాం హయాంలో మొదలైన సంప్రదాయ డబుల్‌ డెకర్‌ బస్సులు 2003 వరకు నగరంలో తిరిగాయి. పర్యాటకంగా చార్మినార్, గోల్కొండ, భాగ్యలక్ష్మీ దేవస్థానం, ట్యాంక్ బండ్ ఎంత ప్రసిద్ధో డబుల్ డెక్కర్ బస్సులు కూడా హైదరాబాద్ లో అంత ప్రసిద్ధి చెందాయి. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండేవి. అయితే… నిజాం హయాంలో మొదలైన సంప్రదాయ డబుల్‌ డెకర్‌ బస్సులు 2003 వరకు నగరంలో తిరిగాయి. ఆ తర్వాత ఆగిపోయాయి.

మళ్లీ మంత్రి కేటీఆర్ చొరవతో డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. ఒకానొక సందర్భంలో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కి పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేశారు. మళ్లీ ప్రారంభించాలని నెటిజన్ కోరాడు. అంతేకాకుండా… మీకు గుర్తుందా సార్ అంటూ అడిగాడు. దీంతో అవునని మంత్రి సమాధానమిచ్చారు. అబిడ్స్‌లోని సెయింట్స్ జార్జ్ గ్రామర్ స్కూల్‌కు వెళ్లే మార్గంలో డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణానికి సంబంధించి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని వెల్లడించారు. దీనిని తిరిగి ప్రారంభించడానికి ఏమైనా ఛాన్స్ వుందా అని రవాణా మంత్రి పువ్వాడను మంత్రి కేటీఆర్ అడిగారు. కేటీఆర్ మాటిచ్చిన రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే మంత్రి కేటీఆర్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు.