ఢిల్లీ మద్య కేసు వ్యవహరం మరో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితకి ఛార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర కూడా వుందని, ఆయన హైదరాబాద్ కి చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఢిల్లీలో ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. అంతేకాకుండా మంగళవారం రాత్రి సీబీఐ ఆయన్ను ప్రశ్నించింది కూడా. విచారణ ముగిసిన తర్వాతే ఆయన్ను అదుపులోకి తీసుకుంది.

 

అయితే… అరెస్ట్ చేస్తున్నట్లు మాత్రం బుధవారం ఉదయం ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ మాజీ ఛైర్మన్ పి శరత్ రెడ్డితో సహా హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల దగ్గర ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేశారు. గోరంట్ల బుచ్చిబాబు పేరుమీద గోరంట్ల, అసోసియేట్స్, శ్రీ ఎంటర్‌ప్రైజెస్, కోజెంట్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి.

 

ఢిల్లీ ఎక్సైజ్ కేసు అనుబంధ ఛార్జిషీట్‌లో  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ  ప్రస్తావించింది. ఈ కుంభకోణంలో సౌత్‌గ్రూప్‌ విజయ్‌నాయర్ ద్వారా..ఆప్‌ నేతలకు రూ. 100 కోట్లు ఇచ్చారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ తెలిపింది. కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూపులో భాగమని వెల్లడించింది.