రాష్ట్రంలోని వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ తేదీలను ఖరారు చేసేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన అధికారులు సమావేశమయ్యారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ సమావేశమయ్యారు.

 

మే 7వ తేదీ నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్‌- ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎడ్‌సెట్‌ను మే 18న, ఈసెట్‌ను మే 20న, లాసెట్‌(ఎల్‌ఎల్‌బీ) మే 20న, మే 20న పీజీఎల్‌ సెట్‌ (ఎల్‌ఎల్‌ఎం), మే 26 నుంచి 27 వరకు పీజీ ఐసెట్‌, మే, 29 నుంచి జూన్‌ ఒకటి వరకు పీజీ ఈసెట్‌ను జరుగనున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్‌ కన్వీనర్లు ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.