ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు 2023-24కుగాను వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్‌ దస్త్రాలతో తన నివాసం నుంచి బయల్దేరారు. పూజల అనంతరం అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా.. అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముందుకు వెళ్తున్నదని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనతో బడ్జెట్‌ కేటాయింపులు చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలోనూ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు.

 

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్‌ దస్త్రాలతో తన నివాసం నుంచి బయల్దేరారు. పూజల అనంతరం అసెంబ్లీకి చేరుకోనున్నారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డితో పాటు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని ఆయన చాంబర్‌లో కలిశారు. ఆయనకు బడ్జెట్‌ ప్రతులను అందజేశారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని మంత్రులు కలిశారు. బడ్జెట్‌ ప్రతిని స్పీకర్‌కు అందజేశారు.

 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు క్యాబినెట్‌ సమావేశమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెలిపింది. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ 20 రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ శాఖలకు సంబంధించి గత కేటాయింపులు, చేసిన వ్యయం తదితర అంశాలపై సమీక్షించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టేబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు.