కేంద్ర ప్రభుత్వం దాదాపు కోటి మంది ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త చెప్పబోతోంది. ప్రస్తుతం అంగీకరించిన ఫార్ములా ప్రకారం కరువు భత్యం (డీఏ)ను మరో నాలుగు శాతం పెంచబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 38 శాతంగా ఉన్న డీఏను 42 శాతానికి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంటే, పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. 2022 సెప్టెంబరు 28న డీఏ రివిజన్ జరిగింది. అది 2022 జూలై 1 నుంచి అమలవుతోంది. అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఈ మదింపు చేశారు. 2022 జూన్తో ముగిసిన 12 నెలల నెలవారీ ధరల సగటు ఆధారంగా ఈ డీఏను నిర్ణయించారు. అప్పుడు కూడా నాలుగు శాతమే పెంచారు. పెరిగే ధరల భారానికి పరిహారంగా డీఏను ప్రభుత్వం చెల్లిస్తుంది. కొంత కాలంలో జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. ఇది సీపీఐ-ఐడబ్ల్యూలో వెల్లడవుతుంది. డీఏను సంవత్సరంలో రెండుసార్లు పీరియాడికల్గా సవరిస్తారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో ప్రతి నెలా పారిశ్రామిక రంగ కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ ను రూపొందిస్తుంది. దీని ఆధారంగా ఉద్యోగులు, పింఛనుదారులకు డీఏను నిర్ణయిస్తారు.












