నో ఫ్లైజోన్గా ఉన్న తిరుమలలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ కలకలం సృష్టిస్తుంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఇన్స్టాగ్రామ్ రీల్ సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొట్టింది. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పశ్చిమ మాఢవీధి వరకు ఉన్న దృశ్యాలు, శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలు దగ్గరగా చిత్రీకరణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ వెంటనే స్పందించింది. శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామని టిటిడి సివిఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.












