తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విశాఖకు చేరుకుంది. టెస్ట్ డ్రైవ్ లో భాగంగా చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ నుంచి విశాఖ రైల్వేస్టేషన్ కు చేరుకుంది. మొత్తం 16 బోగీలతో వున్న ఈ రైలును చూసేందుకు ప్రయాణికులు ఆసక్తిచూపారు. తొలుత దీన్ని సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడపాలని ప్రతిపాదించినా.. ఆ తర్వాత విశాఖట్నం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా వర్చువల్గా ప్రారంభమయ్యే ఈ రైలును తొలుత ట్రయల్ రన్ కోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి విశాఖపట్నం పంపించారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ప్రయాణ దూరం 700 కి.మీ. కాగా, ఈ రైలు కేవలం 8.40 గంటల్లోనే గమ్యస్థానం చేరుస్తుందని విశాఖ రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ సురేశ్ తెలిపారు. ఈ రైలును గంటకు 160 కి.మీ. వేగంతో నడపొచ్చని చెప్పారు.












