తోపులాట, గలాట నేపథ్యంలో ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరగడంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది.  శుక్రవారం ఉదయం మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన ఢిల్లీ మున్పిపల్ కార్పొరేషన్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుడిని కాకుండా వేరొక సభ్యుడిని ప్రిసైడింగ్ స్పీకర్‌గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపై ఆప్ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రొటెం స్పీకర్ సత్య శర్మను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ్యులెవరీనీ ప్రమాణస్వీకారం చేయనీయలేదు. ఈ క్రమంలో బీజేపీ, ఆప్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు సభ్యులు మైకులు, కుర్చీలను విరగొట్టారు.

ఈ ఘటనలో కొందరు సభ్యులకు గాయాలయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ ఎన్నిక నిర్వహించకుండానే సభ వాయిదా పడింది. డిసెంబరులో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాలకు గాను.. 134 స్థానాల్లో ఆప్  అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలకే పరిమితమయింది. కాంగ్రెస్ కేవలం 9 సీట్లతో సరిపెట్టుకుంది.

నామినేటెడ్​ సభ్యులు ఎన్నడూ ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ హౌస్​లో ఓటేయలేదని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. స్టాండింగ్​ కమిటీ సభ్యులను కూడా ఓటింగ్​కు అనుమతించలేదంటూ మండిపడ్డారు. హౌస్​లో తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ నీచ రాజకీయాలకు దిగుతున్నదని విమర్శించారు. సభలో ఆప్ కౌన్సిలర్లు గందరగోళం సృష్టిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ మనోజ్​ తివారీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికలంటే ఆప్​ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు.

Related Posts

Latest News Updates