తెలంగాణ రాష్ట్ర ప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని తేడాలేకుండా ప్రజలంతా సంబురాల్లో మునిగిపోయారు. కొత్త ఏడాది అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రాజధాని మొదలు పట్టణాలు, పల్లెల్లో యువత కేరింతలు కొట్టారు. 2022కి వీడ్కోలు.. 2023కి వెల్‌కమ్‌ చెబుతూ ఆనంద డోలికల్లో తేలిపోయారు. ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ అంటూ కేకలు వేస్తూ కేక్‌లు కట్‌చేసి ఆటపాటలతో ఎంజాయ్‌ చేస్తూ కొత్త సంవత్సరాన్ని నిండుమనసుతో ఆహ్వానించారు.

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.  పంజాగుట్టలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు భక్తులతో కలిసి కేక్‌ కట్‌చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఎల్బీనగర్‌ చౌరస్తాలో జరిగిన వేడుకల్లో రాచకొండ సీపీ దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కేట్‌ కట్‌చేశారు.

జిల్లాలోనూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 2023కు స్వాగతం పలుకుతూ హనుమకొండలోని పలు కాలేజీల విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. కరీంనగర్‌ జిల్లాలోని అల్ఫోర్స్‌ కళాశాలలో విద్యార్థుల కేరింతలు కొట్టారు.ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2023కి చిన్నాపెద్ద అట్టహాసంగా స్వాగతం పలికారు. కేక్‌లు కట్‌ చేసి నోరు తీపి చేసుకున్నారు. అలయ్‌ బలయ్‌తో శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి.