స్టార్ హీరో రేంజ్ లో సుడిగాలి సుదీర్ ‘గాలోడు’ 375 థియేటర్లలో విడుదల!

సుడిగాలి సుధీర్  సోలో హీరోగా వస్తోన్న రెండో సినిమా ‘గాలోడు’  రేపు విడుదలవుతోంది. ఈ సినిమా కోసం సుధీర్ అభిమానులు వేచి చూస్తున్నారు. అయితే, సినిమాకు పెద్దగా బజ్ లేకపోయినా సుధీర్‌కు ఉన్న చిన్న మార్కెట్ వల్ల గట్టెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 375‌కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా మరీ ఎక్కువగా లేదు. ఈ సినిమా గెహ్నా సిప్పీ హీరోయిన్‌గా నటించారు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా మారిన ‘జబర్దస్త్’ కమెడియన్, టీవీ యాంకర్ సుడిగాలి సుధీర్.. ఇప్పుడు ‘గాలోడు’ అనే మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమా ద్వారా సుధీర్‌ను హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.. ‘గాలోడు’ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాను రేపు విడుదల చేస్తున్నారు. రేపు అన్నీ చిన్న సినిమాలే థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో ‘గాలోడు’ సినిమాకు కాస్త ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సుధీర్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని 375కు పైగా థియేటర్లలో ‘గాలోడు’ సినిమాను విడుదల చేస్తున్నారు. నైజాంలో 130కి పైగా థియేటర్లలో.. ఆంధ్రలో 185కు పైగా స్క్రీన్లలో ‘గాలోడు’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక సీడెడ్‌లో సుమారు 60 థియేటర్లలో ‘గాలోడు’ విడుదల కాబోతోంది. మొత్తం ఏపీ, తెలంగాణలో 375కు పైగా థియేటర్లలో సుధీర్ సినిమా రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘గాలోడు’ సినిమాకు రూ.2.75 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. అంటే, ఈ సినిమా రూ.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే నిర్మాత సేఫ్. సుధీర్‌కు ఉన్న ఇమేజ్‌తో ఈ టార్గెట్‌ను కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతానికి అయితే పెద్దగా బజ్ లేకపోయినా.. సినిమా బాగుంటే మౌత్ టాక్‌తో వెళ్లిపోతుందని అంటున్నారు. బుక్ మై షో యాప్‌లో 16 వేల మంది ఈ సినిమాపై ఇంట్రస్ట్ చూపించారు. ‘గాలోడు’ కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. సుధీర్ ఇమేజ్‌‌ను దాటి వెళ్లిన సినిమా ఇది. ఇప్పటి వరకు సుధీర్‌ను ప్రేక్షకులు కమెడియన్‌గానే చూశారు. కానీ, ఈ సినిమాలో మాస్ హీరోగా చూడబోతున్నారు. మరి ఆయన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో చూడాలి. ఈ సినిమాలో సప్తగిరి, షకలక శంకర్, సత్య క్రిష్టన్, పృథ్వీరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కథ, కథనం, మాటలు, దర్శకత్వం రాజశేఖర్ రెడ్డి పులిచర్ల అందించారు. ఆయనే నిర్మాత కూడా. భీమ్స్ సిసిరొలియో సంగీతం సమకూర్చారు. ఎమ్మెస్సార్ ఎడిటర్. బాబా భాస్కర్, అనీష్, వెంకట్ దీప్ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. సి.రామ్ ప్రసాద్ ప్రొడక్షన్ డిజైన్ చేయడంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా అందించారు.

Related Posts

Latest News Updates