మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించలేదు. మొదటి నుంచి చివరి రౌండ్ వరకు మూడో స్థానంలోనే ఉండిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ఉదయం 10 గంటల సమయంలోనే వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రం వైపు కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెత్తి కూడా చూడలేదు. డిపాజిట్ కూడా కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.







