తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది.  మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం తెలిసిందే. 48గంటల పాటు ర్యాలీలు, సభలు, సమావేశాలకు హాజరుకావొద్దని  ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మీడియాతో ఊడా మాట్లాడొద్దని.. ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ సాయంత్రం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్​ఎస్​కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని జగదీశ్‌రెడ్డి అన్నారని బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. తొలుత మంత్రి నుంచి వివరణ కోరింది ఎలక్షన్​ కమిషన్​. కాగా, ఇవ్వాల మంత్రి జగదీశ్​రెడ్డి ఇచ్చిన వివరణ సహేతుకంగా లేదన్న కారణంతో ఈసీ యాక్షన్​ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం మునుగోడులో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా మంత్రిగా జగదీశ్‌రెడ్డి ఈ సభకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.