కర్నాటక లో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా… బీజేపీని గద్దె దింపి, తాము అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. కేంద్ర మంత్రి, కర్నాటక ఎన్నికల ఇంచార్జీ ధర్మేంద్ర ప్రదాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ జాబితాను విడుదల చేశారు.
224 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది బీజేపీ. తొలి జాబితాలో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించింది. ఈ లిస్ట్ లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆ రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు బళ్లారి రూరల్ నుంచి పోటీ చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కి ప్రత్యర్థిగా బీజేపీ ఆర్. అశోకను బరిలోకి దింపింది. ఫస్ట్ లిస్టులో 52 మంది కొత్త అభ్యర్థులు, 32 మంది వెనుబడిన వర్గాల అభ్యర్థులు, 30 మంది షెడ్యుల్ కులాల అభ్యర్థులు ఉన్నారు. 9 మంది అభ్యర్థులు డాక్టర్లు, ఐదుగురు న్యాయవాదులు, ఇద్దరు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ,8 మంది మహిళలు ఉన్నారు.