గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత బుధవారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మపురస్కారాలను కేంద్రం ప్రకటించగా.. మార్చి 22న తొలి విడతలో 50 మందికిపైగా పద్మ అవార్డులు ప్రదానం చేశారు.

తాజాగా, బుధవారంసాయంత్రం మిగిలిన వారందరికీ పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. దివంగత నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్‌ను ఆయన తనయుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అందుకున్నారు.

ఆధ్యాత్మిక రంగంలో సేవలకుగాను చిన్నజీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు బహూకరించారు. సామాజిక సేవలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు.  సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో మిల్లెట్ మ్యాన్ ఖాదర్వలీ, కళారంగంలో సేవలకు గాను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, విజ్ఞాన రంగంలో ప్రొఫెసర్ నాగప్ప గణేష్, విజ్ఞాన రంగంలో అబ్బారెడ్డి రాజేశ్వర్రెడ్డి, కళారంగంలో రవీనా టాండన్ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాటోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖుుల పాల్గొన్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి కీరవాణి కుటుంబంతోపాటు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.